Category: తెలంగాణ | 06 Jun 2025, 08:27 PM
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరగాలి
పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోంది
పాఠశాల విద్య శాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి
స్పైడర్, వరంగల్ : బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని పాఠశాల విద్య శాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఖాజీపేట మండలం మడికొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి హజరయ్యారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, అంగన్వాడి టీచర్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు మరియూ యువకులు హజరయ్యారు. ఈసందర్భంగా సమావేశంలో ఆర్జేడి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో ప్రభుత్వం అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు తమ పరిధిలో గల ఆవాస ప్రాంతం లో ప్రతీ ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను వివరించి, ప్రభుత్వ బడి పట్ల తల్లితండ్రులకు విశ్వాసం కల్పించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల కు కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలేజెన్సీ ). విధానంలో తరగతి బోధన ఉంటుందని దానికి అనుగుణంగా పాఠాలా రూప కల్పన జరిగిందని వివరించారు. లక్షల రూపాయల వ్యయం తో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. ఆంగ్ల భాష నైపుణ్యం పెంచడానికి, NMMS, గురుకుల, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల తయారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, కృత్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రెండు జతల ఏకరూప దుస్తులు ఇవ్వడం గ్రంధాలయం,ప్రయోగశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పారు. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు.ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి, మండల విద్యాధికారి మనోజ్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, మాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.