Category: తాజా వార్తలు | 07 Jun 2025, 08:08 AM
పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి
సోషల్ మీడియా ప్రభావంతో పెడదోవ
తరుణి స్వచ్ఛంద స్టేక్ హోల్డర్ మీటింగ్లో సోషల్ మీడియా వారియర్ రాజశేఖర్
స్పైడర్, వరంగల్ : సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు పెడదోవ పడుతున్నారని సోషల్ మీడియా వారియర్ రాజశేఖర్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనపై అవగాహన కలిగి ఉండాలని, అలాంటప్పుడే వారిని వక్రమార్గం వైపు వెళ్లకుండా ఆపగలమని అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కేంద్రంలోని పాఠశాలలో తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్ సమావేశం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పలు విభాగాల ప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, బాలికల కమిటీ సభ్యులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లడుతూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మొబైల్ ఆప్లికేషన్లు విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వాడకాన్ని గమనించాలి, ఆపదలోకి వెళ్లకూండా చూడాలని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యత తీసుకోవాలి. స్కూల్, కాలేజ్ వెళ్తున్న సమయంలో ఒక నిఘా తప్పనిసరని అన్నారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ మేడం మాట్లాడుతూ టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. పిల్లలను ప్రేమగా చూడటంతో పాటు వారి ముందు గొడవలు పడకూడదని అన్నారు. అలా చేస్తే పిల్లలపై నెగటివ్ ప్రభావం పడుతుందని అన్నారు. సీడబ్ల్యూసీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, పిల్లల రక్షణ అంశాల్లో ఎవరైనా 1098 లేదా 181 నంబర్లకు కాల్ చేసి సమాచారమివ్వాలి. ఈ అంశాల్లో మనం అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ కళావతి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలు అపవృథా కాకుండా శిక్షణా కార్యక్రమాలు, క్రీడలు, సృజనాత్మక అంశాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తరుణి సెంటర్ ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు.