Category: తాజా వార్తలు | 07 Jun 2025, 12:41 PM
హిడ్మా తాజా చిత్రం లీక్... నేషనల్ పార్కులోనే మట్టుబెట్టేస్తారా..?!
స్పైడర్, ఖమ్మం : భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్టు అగ్రనేత.. పీఎల్జీఏ సారథి, మావోయిస్టు పార్టీ కేంద్ర యాక్షన్ టీం వ్యూహకర్త హిడ్మా తాజా చిత్రం లీకయింది. ఇన్నాళ్లు హిడ్మా ఎలా ఉంటాడో పోలీసు బలగాలకు సైతం తెలియదు. కానీ ఇతనే హిడ్మా అంటూ పోలీసు వర్గాలకు ఓ తాజాచిత్రం చేరినట్లు సమాచారం. దాదాపు పాతికేళ్ల క్రితం నాటి ఫొటోనే ఇన్నాళ్లూ అందుబా టులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో అతడి తాజా చిత్రం బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ ఫొటోనే మీడియా, సోషల్ మీడియాలోనూ బాగా వైరలవుతోంది. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్లోని నేషనల్ పార్క్లోనే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తలదాచుకున్నట్లుగా తెలుస్తుండగా.. వరుసగా అగ్రనేతలు హతమవుతుండటం ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో మృతిచెందగా.. నేషనల్ పార్కులో గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు భాస్కర్ మరణించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్డీఏ) మొదటి బెటాలియన్ నేషనల్ పార్కులోనే ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తు న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిడ్మా తాజా చిత్రం బహిర్గతం కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. హిడ్మా దండకా రణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపుదాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈక్రమంలోనే చత్తీస్గడ్లోని దండకారణ్యంపై పట్టు సాధించిన సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు మావోయిస్టులను మట్టుబెడుతూ ముందుకు సాగుతున్నాయి ఒకరకంగా చెప్పాలంటే కగార్ ఆపరేషన్ దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు. అగ్రనేతల్లో చెప్పుకోదగిన హిడ్మా, గణపతియే ముఖ్యలని చెప్పవచ్చు.