Category: తెలంగాణ | 25 May 2025, 11:46 AM
సరస్వతీ పుష్కరిణిలో జనసంద్రం... కాంతులీనుతున్న కాళేశ్వరం..
స్పైడర్, వరంగల్ ప్రతినిధి ; అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తోంది. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్నా అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దీంతో దేశంలో రెండో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది.
జనం... జనం...
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాలు కోసం దేశం నలుమూలల భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజు రోజుకు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. ప్రతి రోజు వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకూ కూడా నదీ తీరం జనమయం అవుతోంది. ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు, మరో వైపున త్రివేణి సంగమానికి చీరె సారె సమర్పించడం, నీటి పక్కన సైకత లింగాలకు పూజలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సరస్వతి సంగమం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ట్త్రివేణి సంగమ తీరంలో భక్తులు పూర్వీకులను స్మరించుకుంటూ పితృ తర్పణాలు కోసం చాలా మంది మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా తమ కుంటుంబ సభ్యులు చనిపోయిన రోజున అమశ్రాద్దం నిర్వహించే తంతు కొనసాగిస్తారు. కానీ పుష్కర నది తీరంలో తీర్థవిధి నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భారతీయ సాంప్రదాయం. ఏటా తమ కుటుంబ సభ్యులకు తిథి కార్యక్రమం చేసినప్పుడు మూడు తరాలను మాత్రమే స్మరించుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ పుష్కర నదీ తీరంలో అయితే తమ గోత్రీకులతో పాటు, చనిపోయిన బంధువులు, స్నేహితులను కూడా స్మరిస్తూ వారి పేరుతో పిండ ప్రధానం చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇలాంటి ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి, సంప్రదాయాలను పాటించేందుకు త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. సోమవారం నాటితో సరస్వతి పుష్కరాల 12 రోజుల కార్యక్రమం ముగియనున్నందున కాళేశ్వరానికి భక్తుల సంఖ్య మరింత తీవ్రంగా పెరిగిపోతోంది.
త్రివేణి హారతి...
ఇకపోతే సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలెట్ గా నిలుస్తోంది త్రివేణి సంగమంలో నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతి. నది హారతి నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను రప్పించారు. కాశీ పూజారులు పుష్కరాలు ప్రారంభం రోజు రోజు రాత్రి నుండి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే కాశీ గంగలో నీటి ప్రవాహంపై బోట్లలో కూర్చుని తిలకించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాళేశ్వరంలో నది తీరం 3 నుండి 4 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండటంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవసరమైన ఏర్పాట్లు చేశారు. రోజూ రాత్రి గంటకు పైగా నిర్వహించే హారతిని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే హారతి ఎంతమేర ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.