Category: తెలంగాణ | 15 May 2025, 09:27 AM
ధరణి బండారం బయట పడనుందా..?
ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్తో అక్రమాలు వెలుగోకి వచ్చే ఛాన్స్
స్పైడర్, హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్ భూముల రికార్డులు తారుమారైనట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ధరణి పోర్టల్కు ముందు ఉన్న రికార్డులు.. ధరణిలో అప్లోడ్ తర్వాత రికార్డుల్లో జరిగిన మార్పులను గుర్తించాలని నిర్ణయించింది. ఈమేరకు ధరణి పోర్టల్పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి.. నివేదికలో నిగ్గు తేల్చాలని భావిస్తోంది. ఈ మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగిచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో అక్రమాలు జరిగాయా లేదా? అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి హామీని అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు ఇప్పటికే ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. అయితే ఆడిట్ నిర్వహణను కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం అందుతోంది. కొంతమంది అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా పోర్టల్ను యాక్సెస్ చేసి భూ రికార్డులను మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమా రు 15 వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించారని ప్రభు త్వం వెల్లడించింది. ఈ భూముల విలు వ రూ.లక్ష కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేసింది. పోర్టల్లో అనేక లోపాలున్నట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేసి ఆ స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణతో ధరణి లోపాలతోపాటు ధరణిని అక్రమంగా వాడుకున్న వారి డొంక కదలనుంది.