Category: తెలంగాణ | 13 May 2025, 06:34 PM
‘వరంగల్.. జరూర్ ఆనా ’
మైమరిపించేలా ఓరుగల్లు అందాలు..
తిలకించేందుకు ప్రపంచ సుందరీమణుల రాక..
విశ్వవ్యాప్తం కానున్న వరంగల్ జిల్లా ఖ్యాతి..
నేడు వరంగల్, ములుగు జిల్లాలో పర్యటన
కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్భందీగా ఏర్పాట్లు..
వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రజలు..
స్పైడర్, హైదరాబాద్, మే 13 : ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు.. చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.. భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం.. రమణీయ శిల్ప సౌందర్యం.. అద్భుతమై ఆలయాలు..అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం..ఒకటి కాదు రెండూ కాదూ..వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం..త్రినగరిలో.. కొలువైన త్రికూటాలయం..వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం..కాకతీయ రాజుల కట్టడాలు.. నేటికీ ఆనాటి చరిత్రకు నిలువెత్తు నిలబడి ఉన్న సాక్ష్యాలు..వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం..కాకతీయులు అద్భుతంగా నిర్మించారు. వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది.. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.. దీంతోపాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఇంతటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు.. పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివీ తీరా పరిశీంచేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్ప తనం ఇట్టే తెలుస్తోంది.. ప్రపంచ సుందరీమణులు (మిస్ వరల్డ్-2025 పోటీదారులు) బుధవారం వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. కాగా, 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని... అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకి స్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అందాల భామల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. వారికి ఎక్కడా ఏలాంటి ఇబ్బందిరాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రభుత్వం వీరి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు.. పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించింది. తద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
చారిత్రాత్మక ఆలయం.. వేయి స్తంభాల గుడి..
వరంగల్లోని వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడే ఈ చారిత్రాత్మక హిందూ దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశ రాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం చేయబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. ఈ ఆలయం..ఈ గుడి క్రీ.శ. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశాల మేరకు నిర్మించారు. ఈ ఆలయం చాళుక్య శైలిలో నిర్మించబడింది. అయితే కాకతీయుల శిల్పకళా వైభవం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. నక్షత్రాకార పీఠంపై నిర్మితమైన ఈ త్రికూటాలయం అద్భుతమైన వాస్తుకళను ప్రదర్శిస్తుంది. ఆలయం కళ్యాణ మంటపం.. ప్రధాన ఆలయంతో కలిపి సుమారు వేయి స్తంభాలతో నిర్మించడంతో దీనికి "వేయి స్తంభాల గుడి" అనే పేరు వచ్చింది.2005–2006లో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ మంటపం కొన్ని స్తంభాల పునర్నిర్మాణం జరిగింది. 2024లో 17 సంవత్సరాల తర్వాత కళ్యాణ మంటపం సందర్శకుల కోసం తిరిగి తెరిచారు. వేయి స్తంభాల గుడి కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి, ఇంజినీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది.
కాకతీయుల వైభవానికి నిదర్శనం.. వరంగల్ కోట..
వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్యం కాలంలో నిర్మితమైన ఒక ఐతిహాసిక దుర్గం. ఈ కోట క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు విస్తరించిన చరిత్రను కలిగి ఉంది. కాకతీయులు (క్రీ.శ. 750-1323) ఈ కోటను నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. కాకతీయులు తమ పరిపాలనలో ఈ కోటను దుర్భేద్యంగా, అద్భుత నిర్మాణాలతో తీర్చిదిద్దారు. కోటలోని మూడు వృత్తాకార పొరలు, నాలుగు భారీ రాతి ద్వారాలు (కీర్తి తోరణాలు), స్వయంభూ శివాలయం వంటివి కాకతీయుల నిర్మాణ వైభవానికి నిదర్శనం.. కాకతీయ రాజు ప్రోల రాజు ఈ కోట నిర్మాణానికి పునాది వేశారని ప్రజలు నమ్ముతారు. గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు వంటి రాజులు ఈ కోటను మరింత బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి, దాని పరిరక్షణ.. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. కాకతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కాకతీయ వైభవ సప్తాహం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణం (కీర్తి తోరణం) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ తోరణం కాకతీయుల నిర్మాణ కళాత్మకతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.
రామప్ప ఆలయం విశిష్టత..
ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఈ ఆలయం రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. శివునికి అంకితం చేయబడింది. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మితమై ఉంది. జులై 25, 2021న, రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీపడగా, 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది. దీని నిర్మాణ సాంకేతికత సౌందర్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని ఓ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఇంతటి అద్భుతమైన ఆలయాలు,, పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేందుకు ప్రపంచ అందాల భామలు తరలిరావడం చరిత్రలో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతోంది. వరంగల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగడం జిల్లా ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. వీటన్నంటినీ తిలకించే అందాల భామలు మంత్రముగ్ధులు కావడం మాత్రం నిజం.. ప్రపంచసుందరీమణుల పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేస్తుంటే.. జిల్లా ప్రజానీకం మాత్రం అందాల భామలను చేసేందుకు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.