Category: తెలంగాణ | 11 May 2025, 08:34 PM
విజిలెన్స్లో అవినీతి ప్రసాదం!
అర్హత లేకున్నా అండదండలతో పోస్టు
నాలుగేళ్లుగా కీలక స్థానంలో తిష్ఠ
గుత్తేదారులను గుత్తపట్టిన అధికారి
అవినీతి, అక్రమార్కులకు అభయహస్తం
ఎంక్వయిరీ నాదే.. రిపోర్ట్ నాదేనంటూ ఇష్టారాజ్యం
అధికారికి అర్హత లేదని పక్కన పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం
ఆ వెంటనే ప్రభుత్వంపై బురద జల్లేందుకు సిద్ధమైన అధికారి
స్పైడర్, హైదరాబాద్ - మే 11 : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి అవినీతిలో రాజ్యమేలుతున్నట్లు సమాచారం. అక్రమాలు, అవినీతి నిగ్గు తేలుస్తూ ప్రభుత్వానికి నివేదించే స్థానంలో ఉన్న సదరు అధికారి... విజిలెన్స్లో పెద్ద సంఖ్యలో తన అనునయులను నియామకం జరిగేలా నాలుగేళ్లుగా పావులు కదుపుతూ..గుత్తేదారులను గుత్త పట్టినట్లుగా శాఖలో చర్చ జరుగుతోంది. మాట వింటే సరేసరి..లేదంటే విచారణ.. ఆతర్వాత నెగటివ్ రిపోర్టులు.. బిల్లులు పెండింగ్లో పడేలా చేస్తుండటంతో గుత్తేదారులు సైతం అధికారి చెప్పినట్లు వినాల్సి వస్తోందని వాపోతున్నారంట. గత నాలుగేళ్లుగా కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు అధికారి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొలువై కోట్లు వెనకేసుకున్నాడన్న విమర్శలు, ఆరోపణలు ఆ శాఖలో బలంగా వినిపిస్తుండటం గమనార్హం.
మెకానికల్ పట్టా..! సివిల్ రిపోర్టులు ఎట్లా..?!
సార్ చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ అయినా.. సివిల్ ఇంజనీరింగ్ వర్క్లపై రిపోర్టులను పరిశీలించే విధుల్లో ఉండటం గమనార్హం. విజిలెన్స్ మ్యానువల్ గైడ్లైన్స్ ప్రకారం.. సదరు అధికారి ఆ కీ పోస్టుకు అనర్హుడే. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారుల అలయ్ బలయ్ సాన్నిహిత్యంతో పోస్టును పట్టేసిన అధికారి.. వచ్చిన కొద్ది రోజుల్లోనే సంపాదనపై పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7యూనిట్లలో విజిలెన్స్లో తన బలగంతో నింపేసి..చీమచిటుకు మన్న తనకు తెలిసే విధంగా.. రాబడి తగ్గకుండా... రాబడి మార్గాలను వెతికి పట్టుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అర్హత లేకున్నా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో పోస్టు పట్టేసిన అధికారి ఆశాఖను గుప్పిట పట్టేశాడు. స్టేట్ విజిలెన్స్లో తనను ఎవరు ఏం చేయాలేరనే విధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. గత నాలుగేళ్లుగా శాఖలో ఉన్నతాధికారిగా కొనసాగుతున్న డిపార్ట్మెంట్లో సుప్రీం అన్నచందంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురివింద గింజల వ్యవహారం..
అడిగినంత పర్సంటేజీ ఇవ్వనందుకు విచారణ పేరుతో గుత్తేదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లు సదరు అధికారిపై ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సదరు అధికారిని వీలైనంత త్వరగా మాతృ శాఖ ఇరిగేషన్కు పంపించేయాలని సూచించినట్లు తెలుస్తోంది. మరో నాలుగేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉన్న అధికారి.. విజిలెన్స్లో కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లు కొనసాగిన అధికారిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన మరో హరిరామ్ నాయక్ అన్న చర్చ విజిలెన్స్లో అటు ఇరిగేషన్లోనూ కొనసాగుతుండటం గమనార్హం. తన బదిలీని ఆపేందుకు ప్రభుత్వంపై బురద జల్లేందుకు సైతం సదరు అధికారి వెనకాడటం లేదంట. గత ప్రభుత్వం హయాంలో నిర్మితమైన ప్రధాన ప్రాజెక్టులు, చెక్ డ్యాంలపై నిక్కచ్చితత్వంతో కూడిన రిపోర్టులు అందజేసినందు వల్లే తనను బదిలీ చేసి.. మరోకరిని ఆ స్థానంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారంటూ మీడియాకు సుద్దపూస లీకులు ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ప్రధాన పత్రికను సైతం తప్పుదోవ పట్టించి..తన పోస్టును కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారంటూ ఉద్యోగుల నుంచి విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం.
పర్సంటేజీ ఇవ్వకుంటే పెనాల్టీ
గుత్తేదారులను పీల్చేస్తున్న మాఫియా
డిపార్ట్మెంట్లో నెట్వర్క్తో అధికారి ఆగడాలు
సంచలనాత్మక కథనం.. మరో సంచికలో