Category: ఎడిటోరియల్ | 01 May 2025, 06:18 PM
జనాభా లెక్కలతో పాటు కులాల వారీగా ఎంత జనాభా ఉందో లెక్కించేలా కేంద్ర ప్రభుత్వం కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య భారతంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కులాల వారీగా జనాభాను గణించలేదు. 1960లో ఒకమారు.. ఎస్టీ, ఎస్సీల్లో ఎంతమంది ఉన్నారని తెలుసుకునేందుకు నాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆ రెండు కులాలకు చెందిన వారి సంఖ్యను తేల్చింది. కుల గణనతో సమాజంలో చీలికలు ఏర్పడుతాయనే భావనతోనే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఈ విషయాన్ని పక్కకు పడుతూ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం సొంతంగా కుల గణను చేపట్టాయి. ఇటీవల తెలంగాణలోనూ ఇది పూర్తయింది. అంతకుముందు.. బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ పూర్తి చేశారు. అయితే దేశ వ్యాప్తంగా మాత్రం ఎప్పుడు జరగలేదు. దీంతో ఇప్పుడు దేశంలో ఎవరి జనాభా ఎంత..? ప ప్రాంతాల వారీగా వారి జనబలమెంతో తేల్చే అవకాశం ఉంది. అయితే గడిచిన కొన్నేళ్లుగా కుల గణన చేపట్టాలని పేర్కొంటూ విపక్షాలు.. ఆయా సామాజిక వర్గాల ప్రజల నుంచి సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతూ వస్తోంది. దీంతో బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఇది పార్టీకి నష్టం కలిగించడమే కాక.. కుల గణన ద్వారానే స్పష్టమైన సామాజిక విధాన రూపకల్పనకు, ఆర్థిక, రాజకీయ మార్పునకు శ్రీకారం చుట్టవచ్చనే భావనతోనే మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
జనాభా, కుల గణనలే ఇక ఇరుసు..!
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భారతం భవిష్యత్ రాజకీయాలను కుల సమీకరణాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 2028లో జరిగే పార్లమెంటు ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన, ఆయా నియోజకవర్గాల రిజర్వేషన్లలో మార్పులు, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యలో పెంపు.. పునర్విభజన.. రిజర్వేషన్ల మార్పు వంటి కీలక మార్పులు జరగనున్నాయి. వీటన్నింటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా లెక్కలు.. కుల గణనే ఇరుసుగా మారనుంది. కులగణనలో బీసీ కులాల ప్రాధాన్యం రాజకీయంగా పెరిగే అవకాశం ఉంది. ముస్లింల లెక్క తేలిపోతుంది. మెజార్టీ ఈజ్ లా.. ఎవరు ఎంత ఉంటే వారికి అంతా.. అనే విధానాలు అమలు జరిపేలా చర్యలు ఉంటాయి. రాజకీయంగా రిజర్వేషన్ల సీట్లు పెరుగుతున్నాయి., విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాల్లోనూ ఇది జరుగుతుంది.
కులాల లెక్కనే రాజకీయ లెక్కలు..!
సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులకు కుల గణనలో తేలే లెక్కలే కీలకం కాబోతున్నాయి. వాస్తవానికి జనాభా లెక్కలు, కుల గణనను చాలా మంది రాజకీయ అవకాశాల కోణంలోనే చూస్తుండటం గమనార్హం. ఎందుకంటే విపక్షాలు.. సంఘాల పోరులో కూడా ఇది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సమాజంలో మరింత వైరుద్యం పెంచడానికే ఈ లెక్కలు దోహదం చేసే అవకాశం ఉందని ఆందోళన చేస్తున్న వారూ ఉన్నారు. వారి ఆందోళనలోనూ కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. కుల గణన లేకపోవడంతో కొన్ని వర్గాలకు సామాజిక ప్రాధాన్యంలో సమన్యాయం జరగడం లేదన్న విమర్శలకు జనాభా, కల గణనతో సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం తర్వాత భారతం భవిష్యత్లో కుల సమీకరణాలతో కూడిన రాజకీయాలు వేగంగా పుంజుకుంటాయనే చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు నిర్ణయాలు, ఎజెండాల్లో మార్పులు తీసుకురావాల్సిందే.. ప్రాంతీయ పార్టీల్లో కొంత అవగాహనతో కూడిన పొలిటికల్ ఎజెండాలు ఎప్పటి నుంచే అమలువుతున్నా.. రెడ్డి కాంగ్రెస్గా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీలో.. కులాల వారీగా లీడర్లను ఎంకరేజ్ చేయడంలో వెనకబడిన బీజేపీ.. తదనుగుణంగా భవిష్యత్లో సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.
- స్పైడర్